స్వర్ణ దేవాలయం తరహాలో చట్టం తెచ్చే యోచన
కల్తీ నెయ్యిపై శాసనసభలో నేడు 10.30 నుంచి 2 గంటల వరకు చర్చ

ఈనాడు, అమరావతి: తితిదేలో కల్తీ నెయ్యి సరఫరా వంటి అపచారాలు ఇకపై జరగకుండా, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించేలా నిబంధనల్ని మరింత తీవ్రతరం చేయాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అవసరమైతే ప్రత్యేకచట్టం తేవాలన్న యోచనలో ఉంది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయానికి ప్రత్యేక చట్టం ఉందని, అదే తరహాలో తితిదేకి చట్టం తెచ్చేందుకు ఉన్న అవకాశాల్ని అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సోమవారం ఉదయం శాసనసభలోని తన ఛాంబర్లో కొందరు మంత్రులు, సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయంలోకి అన్యమతస్తులు ప్రవేశించాలంటే డిక్లరేషన్ ఇవ్వడం తప్పనిసరి చేస్తూ.. నిబంధనల్లో మార్పులు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై మంగళవారం శాసనసభలో ప్రత్యేక చర్చ చేపట్టనున్నారు. అధికార కూటమిలోని మూడు పార్టీలకు చెందిన సుమారు 10 మంది సభ్యులతో ఈ అంశంపై మాట్లాడించనున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ గొంతు నొప్పి కారణంగా సోమవారం శాసనసభ సమావేశాలకు హాజరుకాలేదు. మంగళవారం కల్తీ నెయ్యిపై చర్చలో ఆయన పాల్గొని మాట్లాడతారని సమాచారం. చివర్లో సీఎం చంద్రబాబు ప్రకటన ఉంటుంది.