
ఇంటర్నెట్డెస్క్: యువతరాన్ని ఆకట్టుకునేందుకు ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్తో వస్తున్నాయి. భారతీయులకు సినిమాలు, క్రికెట్ అంటే ఎంతటి ఆసక్తో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేటి యువత సంవత్సరంలో మిగిలిన అన్ని వేళలా సినిమాలపైనే చర్చ జరిపితే, ఐపీఎల్ సీజన్లో దృష్టంతా క్రికెట్పైనే పెడుతుంది. ఇలాంటి సమయంలోనూ యువతను ఆకట్టుకునేలా వినూత్న కంటెంట్లో జియో హాట్స్టార్ సిద్ధమైంది. మార్చి 26 నుంచి మే 31 వరకూ జరిగే ఐపీఎల్ సీజన్ జరగనుంది. సాధారణంగా ఐపీఎల్ వస్తే అటు టీవీ రిమోట్, ఇటు మొబైల్ యువత చేతిలోనే ఉంటాయి. ఈ సీజన్లో క్రికెట్+ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు 100 మైక్రో డ్రామాలను జియో హాట్స్టార్ సిద్ధం చేసింది. మ్యాచ్ల మధ్యలో వీటిని ప్రసారం చేయనున్నట్లు సంబంధిత వర్గాలు సమాచారం.
ఏంటీ మైక్రో డ్రామాలు..
ప్రస్తుతం యూట్యూబ్, ఇన్స్టాలో షార్ట్స్కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక అంశంపై గంటల గంటలు విశ్లేషణలు చూడటానికి, లేదా వినడానికి యువత ఆసక్తి చూపడం లేదు. దీంతో కంటెంట్ క్రియేటర్లు కూడా చెప్పాలనుకున్న సమాచారాన్ని సూటిగా సుత్తి లేకుండా చెబుతున్నారు. మైక్రో డ్రామాలు కూడా ఇలాంటివే. ఇప్పటికే కొందరు కంటెంట్ క్రియేటర్లు, కొన్ని యాప్లు (microdrama platforms in india) ఈ తరహా కంటెంట్ను యువతకు అందిస్తున్నాయి. మైక్రో డ్రామాల నిడివి 60 నుంచి 180 సెకన్ల మధ్య ఉంటుంది. కంటెంట్ను బట్టి, ఒక్కో ఎపిసోడ్ను 60 నుంచి 90 సెకన్ల నిడివికి కట్ చేసి ప్రసారం చేస్తారు.
ఇప్పుడు జియో హాట్స్టార్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. ఐపీఎల్ జరిగినన్ని రోజులు మ్యాచ్ల మధ్యలో వీటిని ప్రసారం చేస్తారు. రివెంజ్, రొమాన్స్, ట్విస్ట్ ఎలిమెంట్స్తో వీటిని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రతి ఎపిసోడ్ ఆసక్తికర ట్విస్ట్తో ముగుస్తుంది. ఇప్పటివరకూ మ్యాచ్ మధ్యలో కేవలం ప్రకటనలకే పరిమితమైన ఓటీటీ సంస్థలు కంటెంట్ను పెంచుకోవడంతో పాటు, తమ యాప్ను మరింతగా యువతకు చేరువ చేసేందుకు సరికొత్త మార్గాల్లో పయనిస్తున్నాయి. హిందీతో పాటు, ప్రాంతీయ భాషల్లోనూ ఈ మైక్రో డ్రామాలను జియో హాట్స్టార్ స్ట్రీమింగ్ చేయనుంది.