Andhra Pradesh
oi-Sai Chaitanya
ఏపీలో నిరుద్యోగుల కోసం జాబ్ నోటిఫికేషన్ల జారీకి రంగం సిద్దం అవుతోంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల కు సర్వం సిద్దమైంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టే దిశగా నిర్ణయం తీసుకున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఉగాది పండగ సందర్భంగా ఉపాధ్యాయ నియామకాలకు ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అదే సమయంలో ఇతర శాఖల్లో ఖాళీల భర్తీ దిశగా జాబ్ క్యాలెండర్ ప్రకటనకు కసరత్తు జరుగుతోంది.
ఏపీ ప్రభుత్వం ఉగాది వేళ ఉద్యోగ క్యాలెండర్ను ప్రకటించనుంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ ‘ఎక్స్’ ద్వారా విడుదల చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపిన 10 వేల పోస్టులతో పాటు మరికొన్ని ఉద్యోగాలతో అధికారులు జాబ్ క్యాలెండర్ను సిద్ధం చేస్తున్నారు. ఇందులో డీఎస్సీ, జూనియర్ లెక్చరర్ పోస్టులు 3 వేలు ఉంటాయి. కాగా, డీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉపాధ్యాయ ఉద్యోగాలు 2,600కు పైగా ఉంటాయని తెలుస్తోంది. బోధనా సిబ్బంది పోస్టులు 1,500 ఉంటాయి. గ్రూప్-1లో వందకు పైగా, గ్రూప్-2 470కు పైగా పోస్టులను భర్తీ చేస్తారు. ఇవి రెండూ కలిపి సుమారు 600 ఉంటాయి. వెయ్యి కానిస్టేబుల్ ఉద్యోగాలు, 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులనూ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు భర్తీ చేస్తుంది. డీఎస్సీ నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ ఇస్తుంది. మిగిలిన వివిధ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. నిర్దేశిత గడువులో వీటిని భర్తీ చేసేలా అధికారులు క్యాలెండర్ ప్రకటించేలా తుది కసరత్తు జరుగుతోంది.

శాఖల శారీగా ఖాళీలు.. భర్తీకి రంగం సిద్దం
అదే విధంగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించడంతో పాటు ఆయా శాఖలు వేగంగా పోస్టులను భర్తీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. న్యాయ వివాదాలు తలెత్తకుండా నోటిఫికేషన్లు ఇచ్చేలా కసరత్తు జరుగుతోంది. న్యాయ వివాదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ
జాబ్ క్యాలెండర్లో 2,600కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. క్యాలెండర్ ప్రకటించిన వెంటనే పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ పోస్టులతో పాటు రాబోయే మూడేళ్ల కాలానికి ప్రకటించబోయే డీఎస్సీలపైనా ప్రణాళిక సిద్దం అవుతోంది. రానున్న కాలంలో వరుస డీఎస్సీల ద్వారా సుమారు 7,500కు పైగా పోస్టులు భర్తీ చేసేలా అధికారులు ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఆర్థిక శాఖ ఆమోదం లభించిన పోస్టుల్లో 470 గ్రూప్-2 పోస్టులు, 101 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వెయ్యి పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితో పాటుగా డిప్యూటీ కలెక్టర్లు 11, డీఎస్పీ సివిల్ 10, డీఎస్పీ జైళ్లు 4, ఆర్టీవో 3, డీఎల్వో 35, కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్ 17, ఏఏవో 3, సీటీవో 10, డీఈవో 2, డీఎస్ డబ్ల్యూవో 4, డీటీడబ్ల్యూవో 2 పోస్టులు ఉన్నాయి. మొత్తం వివరాలను జాబ్ క్యాలెండర్ లో వెల్లడించనున్నారు.