
ఇంటర్నెట్ డెస్క్: టీ20ల్లో ఐసీసీ ర్యాంకులు వచ్చేశాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమ్ఇండియా ప్లేయర్లే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అయితే, ఈ వారంలో జరగనున్న మ్యాచుల్లో రాణించడం భారత ఆటగాళ్లకు అత్యంత కీలకం. లేకపోతే ర్యాంకింగ్స్పై ప్రభావం పడే ప్రమాదం లేకపోలేదు.
టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత డ్యాషింగ్ ఆటగాడు అభిషేక్ శర్మ (874 పాయింట్లు) తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ ప్రపంచ కప్లో అతడి నుంచి కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే వచ్చింది. మూడు మ్యాచుల్లో డకౌట్ అయిన సంగతి తెలిసిందే. అతడి వెనుకనే పాకిస్థాన్ ఓపెనర్ సహిబ్జాద ఫర్హాన్ (848) కాచుకొని ఉన్నాడు. శ్రీలంకపై సెంచరీతో చెలరేగిన అతడు తన పాయింట్లను భారీగా పెంచుకున్నాడు. ఒక స్థానం మెరుగుపర్చుకుని మూడు నుంచి రెండులోకి వచ్చాడు. ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ (803) మూడు ర్యాంకు పడిపోయాడు. పాతుమ్ నిశాంక (766)ను వెనక్కి నెట్టిన ఇషాన్ కిషన్ (783) నాలుగులోకి దూసుకొచ్చాడు. హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ (749) ఆరో ర్యాంక్కు చేరాడు. ఇక విండీస్పై అజేయంగా 97 పరుగులు చేసి గెలిపించిన సంజు శాంసన్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి 40వ ర్యాంకుకు చేరాడు.
వరుణ్దే అగ్రస్థానం..
టీ20 ప్రపంచ కప్లో మెరుగైన బౌలింగ్తో భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ ముందున్నారు. ఐసీసీ బౌలింగ్ ర్యాంకుల్లోనూ మెరుగ్గా రాణించారు. వరుణ్ చక్రవర్తి (818) అగ్రస్థానంలోనే కొనసాగుతుండగా.. జస్ప్రీత్ బుమ్రా (671) ఎనిమిది నుంచి ఏడో ర్యాంకుకు చేరాడు. అర్ష్దీప్ సింగ్ (653) ఏకంగా ఆరు స్థానాలు దూసుకొచ్చి 13వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా (328) టాప్ ర్యాంక్లో ఉండగా.. భారత స్టార్ హార్దిక్ పాండ్య (284) రెండో స్థానానికి వచ్చాడు. సైమ్ ఆయూబ్ (275) కిందకి దిగజారి మూడో ర్యాంకుకు పరిమితమయ్యాడు. టాప్ 10లో భారత్ తరఫున పాండ్యతోపాటు శివమ్ దూబె (9వ ర్యాంకు) మాత్రమే ఉన్నాడు.