Thursday, March 12, 2026
HomeBusinessUstaad Bhagat Singh,Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ కథపై మళ్లీ రచ్చ... ఒక్క అప్‌డేట్‌తో ట్రోల్స్‌కి...

Ustaad Bhagat Singh,Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ కథపై మళ్లీ రచ్చ… ఒక్క అప్‌డేట్‌తో ట్రోల్స్‌కి చెక్! – pawan kalayn ustaad bhagat singh story on bookmyshow sparks theri remake buzz

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై కొత్త చర్చ మొదలైంది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో కనిపించిన కథ సారాంశం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అందులో ఒక ఐపీఎస్ అధికారి తన కుమార్తెతో అజ్ఞాతంలో జీవిస్తూ, గతంలో జరిగిన సంఘటనల కారణంగా మళ్లీ శత్రువులను ఎదుర్కొనే కథగా పేర్కొన్నారు. ఈ కథ లైన్ తమిళ స్టార్ విజయ్ నటించిన ‘తెరి’ సినిమాను పోలి ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

BookMyShow Updated Synopsis of Ustaad Bhagat Singh
BookMyShow Updated Synopsis of Ustaad Bhagat Singh(ఫోటోలు– Samayam Telugu)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’‌ విడుదలకు సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ మూవీలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవన్ – హరీష్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అందుకే ఈ జోడీ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ఈ సినిమాపై మంచి బజ్‌ను తీసుకొచ్చాయి.

* వరుస ఫ్లాపులతో రూటు మార్చిన సల్మాన్ ఖాన్.. సూపర్ హీరోగా సరికొత్త ప్రయోగం!

మొదట ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. అయితే యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా వాయిదా పడటంతో ఆ రిలీజ్ స్లాట్‌ను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ దక్కించుకుంది. దీంతో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్చి 19న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఉగాది సందర్భంగా విడుదల కానుండటంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కథపై సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ఈ చిత్రానికి సంబంధించిన కథ సారాంశం కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆ స్టోరీ లైన్ తమిళ స్టార్ విజయ్ నటించిన ‘తెరి’ సినిమా కథను పోలి ఉందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

* బాలకృష్ణతో సై అంటోన్న మంచు మనోజ్.. పవర్‌ఫుల్ విలన్ రోల్‌?

బుక్ మై షోలో కనిపించిన కథ ప్రకారం, ఒక ఐపీఎస్ అధికారి తన కుమార్తెతో కలిసి సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. క్రూరమైన నేరస్థులు అతని కుటుంబాన్ని నాశనం చేయడంతో తన కూతురిని కాపాడుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతని గతం మళ్లీ అతని ముందుకు వచ్చి నిలబడుతుంది. తనకు మిగిలిన ఏకైక కూతురిని రక్షించేందుకు అతను మరోసారి శత్రువులపై పోరాటం ప్రారంభిస్తాడు. ఈ కథాంశం ‘తెరి’ సినిమా కథను గుర్తు చేస్తోందని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. కొంతకాలంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తమిళ చిత్రం ‘తెరి’కి రీమేక్ అన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పోలీస్ అధికారిగా కనిపించనుండటం, ఇద్దరు హీరోయిన్లు ఉండటం వంటి అంశాల వల్ల ఈ పోలికలు వస్తున్నాయని కొందరు భావిస్తున్నారు. దీంతో బుక్ మై షోలో కనిపించిన కథ లైన్ చూసి మెగా అభిమానుల్లో కొంత టెన్షన్ కూడా నెలకొన్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా బుక్‌ మై షోలో మరో కథ కనిపిస్తోంది. దాని ప్రకారం ‘తనకు భగత్ సింగ్ అనే పేరు పెట్టి, విలువలు మరియు సిద్దాంతాలను నేర్పిన తన గురువు ప్రేరణతో ఒక గిరిజన బాలుడు పెరుగుతాడు. బలమైన నైతిక విలువలు, అచంచల ధైర్యంతో ఎదిగిన అతను అన్యాయానికి ఎప్పుడూ తలొగ్గడు. పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా చెడు శక్తులకు ఎదురొడ్డి నిలబడతాడు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనేది కేవలం శక్తితోనే కాకుండా నిజాయితీ, ధర్మం మరియు లక్ష్యంతో పోరాడే ఒక మనిషి కథ’ అని అందులో ఉంది. కథపై ట్రోల్స్ కనిపించడంతోనే బుక్‌మైషోలో కథని మార్చి ఉండొచ్చని తెలుస్తోంది.

అయితే దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం ఈ వాదనను ఇప్పటికే పలు సందర్భాల్లో ఖండించారు. ఈ సినిమా పూర్తిగా ఒరిజినల్ స్క్రిప్ట్‌తో రూపొందుతోందని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ నిజంగా రీమేక్ అయితే తాను “కథ, మాటలు, దర్శకత్వం” అని టైటిల్ కార్డ్ ఎందుకు వేసుకుంటానని ప్రశ్నించారు. పోలీస్ కథల్లో నేరస్థులపై పోరాటం అనే అంశం సాధారణంగా ఉండే విషయమని, అందువల్ల కొన్ని కథలు ఒకేలా కనిపించడం సహజమని ఆయన వివరించారు. టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో సినిమాలు విడుదలకు ముందే తాత్కాలిక కథ లైన్లు చేర్చడం సాధారణమే. తర్వాత అసలు కథకు అనుగుణంగా వాటిని మార్చే సందర్భాలు కూడా ఉంటాయి. మొత్తానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కథపై మొదలైన ఈ కొత్త చర్చ టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.

వీరేష్ బిళ్ళ

రచయిత గురించివీరేష్ బిళ్ళవీరేశ్ బిల్లా సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. గతంలో ఆయన ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, పొలిటికల్ న్యూస్, క్రికెట్ వార్తలు రాశారు. ఆయనకు హైపర్ లోకల్ న్యూస్ రాసిన అనుభవంతోపాటు వీడియో టీమ్ కోసం పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆయనకు జర్నలిజంలో 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు. వీరేశ్ ఈజేఎస్‌ నుంచి వెబ్ జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు.… ఇంకా చదవండి