Telangana
oi-Lingareddy Gajjala
కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ ద్వారబంధనం చేసుకున్నాయి. గ్రహణ ప్రభావం కారణంగా ఆలయాల్లోని శక్తి తరంగాల్లో మార్పులు సంభవిస్తాయని, అందుకే శాస్త్రోక్తంగా శుద్ధి కార్యక్రమాలు నిర్వహించే వరకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు వేద పండితులు వెల్లడించారు. తిరుమల నుంచి కాళేశ్వరం వరకు అన్ని ప్రధాన ఆలయాల్లో ఆర్జిత సేవలు రద్దయ్యాయి.
ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో గ్రహణ వేళలు..
ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని మంగళవారం తెల్లవారుజామున స్వామివారి కైంకర్యాల అనంతరం ఉదయం 6:20 గంటలకే మూసివేశారు. తిరిగి రాత్రి 7:30 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ నిర్వహించనున్నారు. అటు కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయాన్ని కూడా అధికారులు ఉదయం 9 గంటలకు మూసివేశారు. గ్రహణం ముగిశాక ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం తర్వాతే భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. విశాఖలోని సింహాద్రి అప్పన్న ఆలయం, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు – మూసివేత:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం ఉదయం 6:30 గంటలకు ద్వారబంధనం చేసుకుంది. ఇక్కడ రేపు ఉదయం 7 గంటల వరకు భక్తులకు దర్శనాలు ఉండవని, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాతే స్వామివారిని దర్శించుకోవాలని అర్చకులు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు, నంద్యాల జిల్లాలోని మహానంది ఆలయాన్ని కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచే మూసివేశారు. సాయంత్రం 7 గంటల తర్వాత సంప్రోక్షణ అనంతరం భక్తులకు అనుమతి లభించనుంది.
భక్తులకు అర్చకుల సూచనలు..
మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ పాక్షిక చంద్రగ్రహణం సాయంత్రం 7 గంటలకు ముగుస్తుందని పండితులు తెలిపారు. ఈ సమయంలో జపాలు, ధ్యానాలు చేయడం విశేష ఫలితాలనిస్తుందని పేర్కొన్నారు. గ్రహణం పూర్తయిన తర్వాత తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకున్నాకే ఆహారాన్ని వండుకుని తినాలని ద్వారకా తిరుమల అర్చకులు సూచించారు. అయితే చిన్నపిల్లలు, రోగులు, వృద్ధులు మాత్రం ఆరోగ్య కారణాల దృష్ట్యా గ్రహణానికి ముందే భోజనం చేయడం ఉత్తమమని వారు స్పష్టం చేశారు.