
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల సంయుక్త సైనిక ఆపరేషన్తో (US Israel strikes) పశ్చిమాసియా మరోసారి అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలోని భారత రాయబార కార్యాలయాలు అప్రమత్తమయ్యాయి. భారత పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, స్థానిక అధికారులు ఇచ్చిన సూచనలను పాటించాలని పేర్కొన్నాయి. ఈ మేరకు యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్ తదితర దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు అడ్వైజరీలు జారీ చేశాయి.
ఇరాన్తో అస్తిత్వ ముప్పు.. అందుకే దాడులు - నెతన్యాహు
- ‘‘దేశంలో ఉన్న భారత పౌరులు అనవసర ప్రయాణాలు మానుకోండి. అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉంటూ యూఏఈ అధికారులు ఇచ్చిన భద్రతా మార్గదర్శకాలు పాటించండి’’ అని యూఏఈలోని భారత ఎంబసీ ప్రకటించింది. అబుదాబీలోని ఎంబసీ, దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ కార్యాలయాల్లో సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయని, అత్యవసర సమయాల్లో సంప్రదించవచ్చని తెలిపింది.
- సౌదీ అరేబియాలో ఉన్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని రియాద్లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. జెడ్డాలోని కాన్సులేట్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
- పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా జోర్డాన్లోని భారతీయ పౌరులు, పర్యటకులు అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీలో పేర్కొంది. వాణిజ్య విమాన సర్వీసులకు అంతరాయం కలగకముందే భారతీయ పర్యటకులందరూ తక్షణమే జోర్డాన్ను వీడాలని సూచించింది.
- బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం కూడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారులు ఇచ్చే మార్గదర్శకాలు, ఎంబసీ సూచనలు పాటించాలని తెలిపింది.
- పాలస్తీనాలో ఉన్న భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని రామల్లాలోని భారత ప్రతినిధి కార్యాలయం వెల్లడించింది. అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. వీటితోపాటు ఇజ్రాయెల్, ఇరాన్లలోని భారత రాయబార కార్యాలయాలు అనవసర ప్రయాణాలు చేయొద్దంటూ అక్కడ ఉన్న మన పౌరులను హెచ్చరించాయి. ఇజ్రాయెల్లోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలని అక్కడి రాయబార కార్యాలయం కోరింది.